ఫీర్జాదిగూడ, సెప్టెంబర్ 19 (ప్రజా వాణి): మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని వినాయక నగర్ కాలనీలో గణపతి పల్లకి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా కాలనీవాసులు ఐకమత్యంతో గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
గణపతి నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన, పల్లకి సేవ, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వినాయక నగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అరుణ్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
పల్లకి శోభాయాత్రలో కాలనీ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ఉపాధ్యక్షుడు గణేష్తో పాటు మహిళలు, భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
