prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 6:11 pm Digital Edition : PRAJA VANI

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా.. ఓదెల మండలంలో అల్పాహార పథకం ప్రారంభం

విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా.. ఓదెల మండలంలో అల్పాహార పథకం ప్రారంభం

రేపు ఓదెల మోడల్ స్కూల్‌లో ఎమ్మెల్యే, విప్ చింతకుంట విజయరమణారావు చేతుల మీదుగా ప్రారంభం

ఓదెల మండల విద్యాధికారి వై రమేష్

ఓదెల, సెప్టెంబర్ 20:
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం ఓదెల మండలంలో సోమవారం, సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభం కానుంది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రతిరోజూ రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం అందించనున్నారు.

ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన ప్రజ్ఞ ఉంటుంది అనే లక్ష్యంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు, ఏకాగ్రత, విద్యా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా భోజనం అందిస్తున్న ప్రభుత్వం, తాజాగా అల్పాహార పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా విద్యార్థుల పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఈ పథకాన్ని సోమవారం ఉదయం 8:30 గంటలకు ఓదెల మోడల్ స్కూల్‌లో పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించనున్నారు.

అదేవిధంగా ఓదెల మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం 8:00 గంటలకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ పాలకవర్గ సభ్యులు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ (AAPC) సభ్యుల ఆధ్వర్యంలో అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన అల్పాహారం అందించడం ద్వారా వారు ఉత్సాహంగా పాఠశాలకు హాజరై, చదువుపై మరింత ఏకాగ్రత కనబరిచేలా ఈ పథకం దోహదపడుతుందని మండల విద్యాధికారి వై. రమేష్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యాశాఖ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు