జగిత్యాల స్టాప్ రిపోర్టర్, వెల్గటూర్ సెప్టెంబర్ 17 (ప్రజావాణి)
వెల్గటూర్ మండల పరిధిలోని కిషన్ రావుపేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన అట్టేం మల్లేష్ (58) తన పెద్ద కుమార్తె కొలకానీ లచ్చవ్వను చూడటానికి ఆమె నివసిస్తున్న కప్పారావుపేట గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో కిషన్ రావుపేట స్టేజి వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వస్తున్న బైక్ అతడిని బలంగా ఢీకొట్టింది.
స్తంభంపెళ్లి గ్రామానికి చెందిన బొల్లం సాయి అనే యువకుడు బైక్ను అతివేగంగా, ఆజాగ్రత్తగా నడిపి మల్లేష్ను ఢీకొట్టడంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లేష్ మృతి చెందారు. మృతుడి కుమార్తె కొలకానీ లచ్చవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ ఎస్సై పి ఉదయ్ కుమార్ తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.