రైతు సంఘం జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి – పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
రైతు సంఘం జాతీయ మహాసభలను నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు నల్లగొండలో నిర్వహిస్తున్న సందర్భంగా, మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (MSP) కల్పించాలని, రైతుల మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తామనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సమగ్రంగా ఉపయోగపడే విధంగా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో విద్యుత్ కోతల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి వ్యవసాయ అవసరాలకు సరిపడా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అన్నారు. వ్యవసాయ రంగానికి అవసరమైన విద్యుత్, సాగునీరు, పంటలకు గిట్టుబాటు ధర వంటి అంశాలపై ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నల్లగొండలోని ఎన్జీ కాలేజీలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు వేలాదిగా రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. రైతాంగ సమస్యలను జాతీయ స్థాయిలో చర్చించి, వాటి పరిష్కారం కోసం జరిగే ఈ మహాసభల్లో రైతులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చందనపల్లి గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, మండల కమిటీ సభ్యులు ఉప్పుల గోపాలు, పోలే సత్యనారాయణ, కొండ వెంకన్న, గ్రామ కార్యదర్శి గంగుల యాదయ్య, నాయకులు రూపని లింగయ్య, తంతనపల్లి సైదమ్మ, నల్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం జాతీయ మహాసభలు మరియు నల్లగొండలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.