prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 1:53 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

రాష్ట్ర రేషన్ డీలర్ల జేఏసీ ఏర్పాటుకు సన్నహాలు: ఈ నెల 17న కీలక ప్రాథమిక సమావేశం!

అమరావతి:పోరుమామిళ్ల సెప్టెంబర్15 ప్రజావాణి రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం,అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఒక ఉమ్మడి కార్యాచరణ సమితి ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి.ఈ క్రమంలోనే రేషన్ డీలర్ల హక్కుల సాధన కోసం కలిసికట్టుగా పోరాడేందుకు ఈ నెల 17వ తేదీన ఒక ముఖ్యమైన ప్రాథమిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రేషన్ డీలర్స్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ ప్రతిపాదనపై రాష్ట్రంలోని వివిధ రేషన్ డీలర్ల సంఘాల అభిప్రాయాలను పంచుకోవడానికి,భవిష్యత్తులో జేఏసీ ఎలా పని చేయాలనే దానిపై ఒక ప్రాథమిక అవగాహనకు రావడానికి మాత్రమే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
సంఘానికి నలుగురు సభ్యులు రావాలి:
ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రంలోని వేరు వేరు రేషన్ డీలర్ల సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్దమనస్సుతో సహకరించాలని లీలా మాధవరావు విజ్ఞప్తి చేశారు.ప్రతి సంఘం నుండి నలుగురు చొప్పున ముఖ్య సభ్యులు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరారు.సమావేశం జరిగే స్థలానికి  సంబంధించిన వివరాలను త్వరలోనే నాయకులందరికీ పంపిస్తామని తెలిపారు.
నాయకుల ఐక్యత – భవిష్యత్తు కార్యాచరణ:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లందరి ప్రయోజనాలే లక్ష్యంగా ఈ జేఏసీ ఏర్పాటు ప్రక్రియ సాగుతోంది.ఈ కీలక ప్రయత్నంలో రాష్ట్ర సమాఖ్య ప్రముఖ నాయకులు సగిలి గుర్రప్ప,ఎం.ప్రసాద్,మస్తాన్ వలి,రాము,సురేష్, వల్లి,మహబూబ్ బాషా,రాజగోపాల్,మరియు కమలాపురం ప్రభాకర్ తదితరులు చురుగ్గా పాల్గొంటున్నారు. సంఘాలన్నీ బేధాభిప్రాయాలు పక్కన పెట్టి, డీలర్ల సంక్షేమం కోసం ఒకే వేదికపైకి రావాలని నాయకత్వం ఆకాంక్షిస్తోంది.
17వ తేదీన జరిగే రాష్ట్ర మహాసభల్లో ప్రకటన:
ఈ నెల 16న జరిగే ప్రాథమిక సమావేశంలో వచ్చే అభిప్రాయాలు,కుదిరే అవగాహన ఆధారంగా తదుపరి అడుగులు పడనున్నాయి.ఆ మరుసటి రోజే,అంటే ఈ నెల 17వ తేదీన అధికారికంగా జరగబోయే “రాష్ట్ర రేషన్ డీలర్స్ సమాఖ్య సమావేశం”లో ఈ జేఏసీ ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను,భవిష్యత్ కార్యాచరణను డీలర్లందరికీ తెలియజేస్తామని ప్రెసిడెంట్ దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా వెల్లడించారు.రాష్ట్రంలోని సమాఖ్య నాయకులు,వివిధ జిల్లాల,సంఘాల ప్రతినిధులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, 17వ తేదీ సమావేశానికి తప్పక హాజరై జేఏసీ ఏర్పాటును బలపరచాలని కోరుతున్నారు.