prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 3:31 pm Digital Edition : MAHESH MEDCHAL

మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు

చదువు పక్కన పెట్టి విద్యార్థులు నీళ్ల కోసం పాట్లు

మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల అవస్థలు

సమీప ట్యాంక్‌ నుంచి పైపుల ద్వారా నీటి తరలింపు.. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

మేడ్చల్, సెప్టెంబర్ 16: చదువుకోవాల్సిన విద్యార్థులు నీటి కోసం శ్రమించాల్సిన పరిస్థితి మేడ్చల్ పట్టణంలోని గాంధీ రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో నీటి వసతి సక్రమంగా లేకపోవడంతో సమీపంలోని ట్యాంక్‌ నుంచి పైపుల సహాయంతో నీటిని తరలించేందుకు విద్యార్థులను వినియోగిస్తున్నారని చెబుతున్నారు.

ఎండలో చిన్నారులతో నీటిని తరలించే పనులు చేయించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఇలాంటి పనులు చేయించడం సరికాదని పేర్కొంటున్నారు. పాఠశాలలో తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని వారు అంటున్నారు.

అధికారుల పర్యవేక్షణ ఏదీ?

పాఠశాలలో నీటి సమస్య ఉన్నప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నీటి అవసరాల కోసం విద్యార్థులపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

చిన్నారుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులతో నీటిని తరలించే పరిస్థితిని వెంటనే నివారించాలని కోరుతున్నారు. పాఠశాలలో నీటి సమస్యకు గల కారణాలను పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యార్థులతో నీటి తరలింపు పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.