prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 6:10 pm Digital Edition : PRAJA VANI

మహిళల పై కుక్కల దాడి..!

*మహిళల పై కుక్కల దాడి..!*
*మహిళపై కుక్కల దాడి.. మున్సిపల్ అధికారుల తీరుపై కాలనీవాసుల ఆగ్రహం*

*బైకును వెంబడిస్తున్న వీధి కుక్కలు.. భయాందోళనలో ప్రయాణికులు..!*
షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 03
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆనంద్ మరియు ఈశ్వర్ కాలనీలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.ప్రతిరోజూ కాలనీవాసులపై దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నాయి.బుధవారం రాత్రి కాలనీ పార్కు వైపు కాలినడకన వెళ్తున్న ఓ మహిళపై వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో అప్రమత్తమైన కొందరు కాలనీవాసులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.కాలనీలో వీధి కుక్కల దాడులకు రోజుకొకరు గురవుతున్నప్పటికీ సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వీధుల్లో నడిచేందుకు, పిల్లలను బయటకు పంపేందుకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొన్నారు. మోటార్ సైకిల్ పై వెళ్తున్న వ్యక్తులని వీధి కుక్కలు వెంబడిస్తున్నాయని ప్రయాణికులు భయాందోళనకు గురి అవుతున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఆనంద్ మరియు ఈశ్వర్ కాలనీలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. మున్సిపల్ చైర్మన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమస్యను పరిష్కరించాలని, ప్రజలకు ప్రమాదకరంగా మారిన వీధి కుక్కలను నిబంధనల ప్రకారం పట్టుకుని నియంత్రణ చర్యలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.