•బ్రీత్ ఎనలైజర్లో 196 ఎంజీ ఆల్కహాల్ నమోదు
•విద్యాశాఖ.. క్రమశిక్షణా చర్యలు
హుజూర్నగర్, సెప్టెంబర్ 18 (ప్రజావాణి): మద్యం మత్తులో పాఠశాలకు హాజరైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం రాజీవ్నగర్ ఎంపీపీఎస్ పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు ధరావత్ వీర్యాపై విద్యాశాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.విధుల్లో ఉన్న సమయంలో నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 196 ఎంజీ/100 ఎంఎల్ ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
•బ్రీత్ ఎనలైజర్లో 196 ఎంజీ నమోదు
విధుల్లో ఉన్న సమయంలో ఉపాధ్యాయుడికి నిర్వహించిన బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 196 ఎంజీ/100 ఎంఎల్ ఆల్కహాల్ స్థాయి నమోదైనట్లు అధికారులు తెలిపారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి రావడంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు నివేదికలను పరిశీలించారు.
•క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్
సెప్టెంబర్ 17న సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి కె. అశోక్ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనలు,1991 ప్రకారం ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.క్రమశిక్షణా విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయాన్ని విడిచి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు.నిబంధనల ప్రకారం జీవన భృతికి ఉపాధ్యాయుడు అర్హుడని అధికారులు స్పష్టం చేశారు.
•విద్యాశాఖ చర్యలపై హర్షం
పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని ఈ ఘటన చాటిచెబుతోందని స్థానికులు పేర్కొన్నారు.విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని వారు కోరుతున్నారు.