మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
అత్వెల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వినూత్న కార్యక్రమం
మేడ్చల్: మట్టి వినాయకుడిని పూజిద్దాం–పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే నినాదంతో అత్వెల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు పర్యావరణహిత వినాయక విగ్రహాలను స్వయంగా తయారు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని మట్టి, పూలు, కూరగాయలు, పిండి, కాగితాలతో విద్యార్థులు వివిధ ఆకృతుల్లో సుమారు 50 వినాయక విగ్రహాలను రూపొందించారు. మధ్యాహ్నం నుంచి విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఓపికగా, భక్తిశ్రద్ధలతో విగ్రహాల తయారీలో పాల్గొన్నారు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండి సహజసిద్ధమైన వస్తువులతో వినాయక విగ్రహాలను తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణహితంగా పండుగను నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సహజ పదార్థాలతో విగ్రహాలను తయారు చేసి పూజించడం, నిమజ్జనం చేయడం ద్వారా నీటి వనరులను పరిరక్షించవచ్చని విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా వినాయక చవితి ఉత్సవాలు కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సమాజంలోని ప్రజలందరినీ ఒకచోటికి తీసుకువచ్చి ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాణిక్యాలరావుతో పాటు ఉపాధ్యాయులు గడప నవీన్, పద్మలత, వసీం, మంజుల, రంగారావు, రాంబాబు, స్వరూపారాణి, ప్రభాకర్, విజయలక్ష్మి, సోనీ తదితరులు పాల్గొన్నారు.