భూమి పనుల పేరుతో రూ.6.14 లక్షలు తీసుకున్నారని ఆరోపణ
డబ్బులు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
ఝరాసంగం, సెప్టెంబర్ 16 (ప్రజావాణి): ఝరాసంగం మండలం మాచునూరు గ్రామం 10వ వార్డుకు చెందిన మునిపల్లి ఎల్లమ్మ కుటుంబానికి సర్వే నంబర్ 100/16లో ఉన్న మూడు ఎకరాల భూమికి సంబంధించిన పనుల పేరుతో నూక మాణిక్యరావు అనే వ్యక్తి రూ.6.14 లక్షలు తీసుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. 13 ఫిబ్రవరి 2026న భూమి వద్దకు వచ్చి కడీలు పాతించడం తదితర పనులు తానే చూసుకుంటానని చెప్పడంతో నమ్మి, ఫోన్పే ద్వారా రూ.3.64 లక్షలు, నగదుగా రూ.2.50 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.
సుమారు ఏడు నెలలు గడిచినా పనులు పూర్తి చేయకపోవడంతో పాటు, తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని నరేష్ పేర్కొన్నారు. డబ్బుల విషయమై ఫోన్లో సంప్రదించగా స్పందించకపోవడంతో పాటు, ఇటీవల మాట్లాడిన సమయంలో తనను దూషిస్తూ చంపుతానని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ మేరకు ఝరాసంగం పోలీస్ స్టేషన్ ఎస్ఐకు ఫిర్యాదు చేసి, ఫోన్పే లావాదేవీలు, ఇతర ఆధారాలను పరిశీలించి సమగ్ర విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమ డబ్బులు తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.