prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:36 pm Digital Edition : RAJU NANGUNOOR

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాదుల పవన్ కుమార్

 

ప్రజావాణి,నంగునూరు,సెప్టెంబర్ 07 : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నంగునూరు మండల కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని తాతా మధు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌ వంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అనుచిత భాష ఉపయోగించడం సరికాదన్నారు. సభాపతిపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదని విమర్శించారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయ చరిత్రలోనే చీకటి రోజుగా నిలిచిపోతుందని అన్నారు. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పందించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని పవన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. అలాగే అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుసూదన్‌తో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలని, ఆయన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు యండి ఇమ్రాన్‌ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ స్పీకర్‌ పదవికి ఎంతో గౌరవం, ప్రాధాన్యత ఉంటాయని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తల పట్ల వ్యవహరించిన తీరును ఆ పార్టీ నేతలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఇమ్రాన్‌ సూచించారు. అప్పటి పరిణామాలను మరిచిపోయి ఇప్పుడు ప్రజాస్వామ్యం, ప్రతిపక్ష హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రజల తరఫున బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఇమ్రాన్‌ అన్నారు. రాజకీయ విమర్శలు ఉన్నప్పటికీ రాజ్యాంగబద్ధ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని పేర్కొన్నారు.