బీఆర్ఎస్లో వికలాంగుల విభాగం ఏర్పాటు చేయాలి
కేటీఆర్కు గిద్దె రాజేష్ విజ్ఞప్తి
వికలాంగులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్
చిలుకూరు: బీఆర్ఎస్ పార్టీలో ప్రత్యేకంగా వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేసి, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల్లో వారికి ప్రాతినిధ్యం కల్పించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు విజ్ఞప్తి చేసినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తెలిపారు. శనివారం చిలుకూరు మండలం రామాపురంలో మునగాల మండల అధ్యక్షుడు గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వికలాంగులు దశాబ్దాలుగా రాజకీయ అవకాశాలకు దూరంగా ఉన్నారని, వారిని కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా రాజకీయ నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యేక వికలాంగుల విభాగాలను ఏర్పాటు చేసి, పార్టీ పదవుల్లో వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు.
బీఆర్ఎస్లో 21 రకాల వికలాంగులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. గతంలో కేసీఆర్ పాలనలో వికలాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం లభించిందని, అదే స్ఫూర్తితో రాజకీయంగానూ అవకాశాలు కల్పించాలని కోరారు.
హామీల అమలుకు బీఆర్ఎస్ పోరాడాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. వికలాంగుల పింఛను పెంపు, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ, అట్రాసిటీ చట్టం-2016 అమలు, ప్రత్యేక సంక్షేమ శాఖ ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
హామీల అమలుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి వికలాంగుల హక్కుల సాధనకు మద్దతుగా నిలవాలని కేటీఆర్ను కోరినట్లు తెలిపారు.
సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ధీరావత్ మహేష్ నాయక్, సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు బండి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కుర్షితు మియా, కాశమల్ల వీరస్వామి, మండల నాయకులు నూక హరికృష్ణ, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.