prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:31 am Digital Edition : NARESH Nayak RAMAYAMPET

బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అవస్థలు

బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అవస్థలు
అధికారులు స్పందించాలని గ్రామస్థుల విజ్ఞప్తి
రామాయంపేట: మండలంలోని దంతేపల్లి, పర్వతాపూర్, కాట్రియాల్ గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సి ఉండగా సమయానికి ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.
ఉదయం పూట విద్యార్థులు బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తుండడంతో పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సు సౌకర్యం లేక కొందరు విద్యార్థులు ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుండగా, ప్రయాణ ఖర్చులు కూడా అదనపు భారంగా మారుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
గ్రామాల నుంచి మండల కేంద్రానికి, విద్యాసంస్థలకు వెళ్లేందుకు అనువుగా ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు సమస్యను పరిశీలించి దంతేపల్లి, పర్వతాపూర్, కాట్రియాల్ గ్రామాలకు క్రమం తప్పకుండా బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.