prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 1:01 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

బద్వేల్ టీడీపీలో ముసలం: రాజీనామా యోచనలో గోపవరం ఎంపీపీ, జడ్పీటీసీ!

వైయస్సార్ జిల్లా బద్వేల్  సెప్టెంబర్ 8 ప్రజావాణి గోపవరం మండలంలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.గోపవరం మండలంలో పార్టీ సీనియర్ నాయకులైన ఎంపీపీ జి. ధనలక్ష్మి, జడ్పీటీసీ జయరామిరెడ్డి తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆర్. సూర్యనారాయణ రెడ్డి అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడల వల్ల తాము తీవ్ర అవమానానికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివాదానికి కారణాలు:

సమాచారం లేని పార్టీ కార్యక్రమాలు:

మండల ప్రథమ పౌరురాలైన ఎంపీపీకి మరియు జడ్పీటీసీ సభ్యునికి కనీస సమాచారం ఇవ్వకుండానే మండలంలో పార్టీ కార్యక్రమాలు, అధికారిక సమీక్షలు నిర్వహిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.తమ స్వంత మండలంలోనే తమకు తెలియకుండా ఇన్‌ఛార్జ్ పర్యటనలు చేయడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

వివాదాస్పద నేత చేరికపై ఆగ్రహం:

గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులను, క్రియాశీల కార్యకర్తలను పలు రకాలుగా వేధించి, ఇబ్బందులకు గురిచేసిన వేణుగోపాల్ రెడ్డి అనే నాయకుడిని పార్టీలోకి చేర్చుకోవడంపై స్థానిక శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని,కార్యకర్తలను వేధించిన వారికి రెడ్ కార్పెట్ పరచడం ఏమిటని జడ్పీటీసీ, ఎంపీపీలు ఇన్‌ఛార్జ్‌ను నిలదీస్తున్నారు.

బీసీ మహిళననే వివక్షా?:

తాను బీసీ యాదవ సామాజికవర్గానికి చెందిన మహిళను కాబట్టే, రాజకీయంగా తనను తొక్కేసేందుకు ఇన్‌ఛార్జ్ కుట్ర పన్నారని ఎంపీపీ ధనలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచేందుకే తమకు సమాచారం ఇవ్వకుండా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ప్రెస్ మీట్ పెట్టి రాజీనామాకు సిద్ధం!

ఇన్‌ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి తీరుతో విసిగిపోయిన గోపవరం జడ్పీటీసీ జయరామిరెడ్డి,ఎంపీపీ ధనలక్ష్మిలు త్వరలోనే విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్) ఏర్పాటు చేసి తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ ఇద్దరు కీలక నాయకులు పార్టీని వీడితే గోపవరం మండలంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని, క్యాడర్ మొత్తం చెల్లాచెదురవుతుందని స్థానిక తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఇప్పటికైనా జోక్యం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని, లేదంటే బద్వేల్ రాజకీయం మరింత హీటెక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.