prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:32 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

పోలీసులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి

పోలీసులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి

 

విధి నిర్వహణలో అప్రమత్తతతొ పాటు వ్యక్తిగత భద్రత కూడా ముఖ్యమే.

 

తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, లాకప్, రైటర్స్ రూమ్ తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణ మరియు సిబ్బంది విధులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐతో స్టేషన్ పరిధిలోని పోలీసింగ్ అంశాలపై ఎస్పీ సమీక్షించారు. సీసీ టిఎన్ఎస్ ఆన్‌లైన్ ప్రక్రియలు, డిజిటల్ అవర్స్ వినియోగం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గ్రామాల సందర్శనలు తదితర అంశాలపై చర్చించారు. స్టేషన్ పరిధిలోని సస్పెక్టెడ్ సీట్స్, రౌడీ సీట్స్ నిర్వహణ, వాటిలో ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు, నిఘా మరియు చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అలాగే గుడుంబా తయారీ, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమ మద్యం నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్, వాహన తనిఖీలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు.
వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటు, అనుమతులు, భద్రతా చర్యలు, నిర్వాహకులతో సమన్వయం తదితర అంశాలపై కూడా వివరాలు తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
స్టేషన్‌లోని పోలీస్ సిబ్బంది సంఖ్య, వారి విధులు, బాధ్యతలు తదితర వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. స్థానిక బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా అవసరమైన రక్షణ పరికరాలు, విధి నిర్వహణకు సంబంధించిన సరైన లాఠీ, రక్షణ వస్తువులు వెంట తీసుకెళ్లాలని సూచించారు.
ప్రజల భద్రత ఎంత ముఖ్యమో, విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది భద్రత కూడా అంతే ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో అప్రమత్తతతో పాటు వ్యక్తిగత భద్రతా ప్రమాణాలను కూడా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, విధుల పట్ల పూర్తి బాధ్యత, అంకితభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ ఈ తనిఖీలు ఎస్పీతోపాటు తొర్రుర్ డిఎస్పీ కృష్ణ కిషోర్, తొర్రుర్ సీఐ గణేష్, ఎస్సై మహేందర్ రెడ్డి తదితర సిబ్బంది ఉన్నారు.