నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ జిల్లా నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), నల్గొండలో చరిత్ర విభాగం ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ మరియు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా పాల్గొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సివిల్ సర్వీసెస్, గ్రూప్–1, గ్రూప్–2 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన విధానం, అర్హతలు, పరీక్షా విధానం, సిలబస్, ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ దశలు, ప్రిపరేషన్ వ్యూహాలు తదితర అంశాలను వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా చదివితే సివిల్ సర్వీసెస్తో పాటు వివిధ పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించవచ్చని కళాశాల పూర్వ విద్యార్థి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ అన్నారు. అలాగే, పోటీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న మార్పులను వివరిస్తూ ప్రిలిమనరీ విధానం తో పాటు, 2013 తర్వాత సీ-షాట్ (C-SAT) విధానంలో పరీక్షల నిర్వహణలో వచ్చిన మార్పులు మరియు వాటి ప్రాధాన్యతను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ప్రస్తుత పరీక్షా విధానాన్ని, ప్రశ్నల సరళిని అర్థం చేసుకొని సమయపాలనతో సాధన చేయాలని సూచించారు. విద్యార్థులు కేవలం డిగ్రీ విద్యకే పరిమితం కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత అవకాశాలను లక్ష్యంగా చేసుకొని ముందుగానే ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రతిరోజూ వార్తాపత్రికలు చదవడం, ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవడం, గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం ద్వారా పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, విద్యార్థులకు విద్యాబోధనతో పాటు కెరీర్ మార్గదర్శకత్వం మరియు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించడం కళాశాల బాధ్యతలో భాగమని అన్నారు. పూర్వ విద్యార్థి చోల్లేటి ప్రభాకర్ తన అనుభవాలను విద్యార్థులతో పంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగం హెచ్ఓడీ డా. బట్టు కిరీటం, అధ్యాపకులు నర్సింగ్ కోటయ్య, హబీబ్, జాజుల దినేష్, నాగరాజు కదిరే, అంకూస్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని పోటీ పరీక్షలకు సంబంధించిన తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.