prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 8:37 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పేరుకేమో కొత్త గాలి మిషన్..వసతుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం! పోరుమామిళ్ల పీ.ఎస్.ఆర్ భారత్ పెట్రోల్ బంకులో వాహనదారుల అవస్థలు.

బోర్డుల మీద ఉచిత సేవలు..తీరా చూస్తే అన్నీ మూతపడ్డ తలుపులు! పెట్రోల్ కొట్టించుకుంటే చాలు అనుకుంటున్న యాజమాన్యానికి, వినియోగదారుల అవసరాలు పట్టవా?

కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్16ప్రజావాణి మండలంలోని రంగసముద్రం పంచాయతీ నరసింహపల్లె విలేజ్ సమీపంలో మెయిన్ రోడ్డుపై ఉన్నటువంటి పీ.ఎస్.ఆర్ ఫిల్లింగ్ స్టేషన్ (భారత్ పెట్రోలియం) బంకులో కనీస వసతులు పడకే శాయి. నిత్యం వందలాది వాహనాలతో బిజీగా ఉండే ఈ ప్రధాన రహదారిపై ఉన్న పెట్రోల్ బంకులో వినియోగదారులకు అందాల్సిన ఉచిత సేవలు పూర్తిగా అలంకారప్రాయంగా మారాయి.దూరప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు,ముఖ్యంగా మహిళలు,పిల్లలు అత్యవసర సమయాల్లో మరుగుదొడ్లను ఉపయోగించుకుందామంటే ఇక్కడ తీవ్ర నిరాశే ఎదురవుతోంది. బంకు ఆవరణలో ఉన్న బాత్రూమ్‌లు సరైన నిర్వహణ లేక, నీటి సదుపాయం లేక అస్తవ్యస్తంగా తయారయ్యాయి.కొన్నిసార్లు తాళాలు వేసి ఉంచడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పేరుకే కొత్త మిషన్ – గాలి మాత్రం సున్నా!
ఇక వాహనదారులకు ఉచితంగా గాలి కొట్టాల్సిన ఎయిర్ మిషన్ కథ మరీ విచిత్రంగా ఉంది. బంకు యాజమాన్యం చూడ్డానికి ఎంతో కొత్తగా ఉన్న గాలి మిషన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ,అది ఎప్పుడూ పనిచేయడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు.ఎప్పుడు అడిగినా “మిషన్ రిపేర్” అంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.దీనివల్ల అత్యవసరంగా గాలి కొట్టించుకోవాలనుకునే టూవీలర్,ఫోర్ వీలర్ వాహనదారులు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
కంపెనీ నిబంధనలు గాల్లోనే..!
భారత్ పెట్రోలియం వంటి ప్రతిష్టాత్మక సంస్థ నిబంధనల ప్రకారం.ప్రతి పెట్రోల్ బంకులో వాహనదారులకు ఉచితంగా గాలి,స్వచ్ఛమైన తాగునీరు,శుభ్రమైన మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలి.కానీ ఈ పీ.ఎస్.ఆర్ బంకులో మాత్రం కేవలం ఇంధనం అమ్మకాలపైనే శ్రద్ధ పెడుతూ,వినియోగదారుల హక్కులను మరియు కనీస అవసరాలను గాలికొదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత సివిల్ సప్లై అధికారులు మరియు భారత్ పెట్రోలియం కంపెనీ ఉన్నతాధికారులు స్పందించి,నరసింహపల్లె వద్ద ఉన్న పీ.ఎస్.ఆర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే నిరుపయోగంగా ఉన్న గాలి మిషన్‌ను అందుబాటులోకి తెచ్చి,మరుగుదొడ్ల వసతిని మెరుగుపరచాలని,లేనిపక్షంలో ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.