prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 12:30 pm Digital Edition : PRAJA VANI

న్యాయం కోసం ‘దీక్షా’స్త్రం..

*న్యాయం కోసం ‘దీక్షా’స్త్రం..

ముదిగొండ పోలీస్ స్టేషన్ ను ముట్టడించిన బాధిత కుటుంబ సభ్యులు

అట్టుడుగుతున్న ముదిగొండ

మూడు రోజులైనా నిందితులను అరెస్టు చేయకపోవడంతో నిరసన

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా ముదిగొండలో తప్పుడు పోక్సో కేసు, రూ. 20 లక్షల బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక యువకుడు వినయ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముదిగొండ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వినయ్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు స్టేషన్ ఎదుటే నిరాహార దీక్షకు దిగారు.బాధితులు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవతలి వాళ్ళు కేసు పెట్టిన కేవలం మూడు, నాలుగు గంటలలోనే పోలీసులు చూపెట్టిన అత్యుత్సాహంపై మండిపడుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు ఏకంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినయ్ మేనమామను, అలాగే వినయ్ తండ్రిని పోలీసులు అర్ధరాత్రి వేళ బలవంతంగా లాక్కొచ్చారని ఆరోపించారు. “మీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలి” అంటూ రాత్రంతా వారిని పోలీసులు దారుణంగా కొట్టారని, ఆ తర్వాత వినయ్‌ను కూడా తీసుకువచ్చి దారుణంగా కొట్టారని కన్నీరుమున్నీరయ్యారు.కేసు పెట్టిన వెంటనే అంత వేగంగా స్పందించి, రాత్రంతా నిర్దాక్షిణ్యంగా కొట్టిన పోలీసులు.. ఈరోజు వినయ్ చనిపోయి మూడు రోజులు అవుతున్నా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. అప్పుడు అంత వేగం చూపించిన ఎస్సై అశోక్ ఈరోజు స్టేషన్‌లో ఎందుకు అందుబాటులో లేరు? నిందితులను పట్టుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? అని కుటుంబ సభ్యులు భగ్గుమన్నారు. వినయ్ చావుకు కారణమైన ఇద్దరు బ్లాక్‌మెయిలర్లను తక్షణమే అరెస్ట్ చేసి, తమకు న్యాయం చేసే వరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా సిపి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు బంధువులు కోరుతున్నారు.