prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 5:58 am Digital Edition : MAHESH MEDCHAL

నాగారం అభివృద్ధికి రూ.5.11 కోట్లు యూజీడీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు

నాగారం అభివృద్ధికి రూ.5.11 కోట్లు

యూజీడీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు

నాగారం: నాగారం డివిజన్‌లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.5.11 కోట్ల నిధులను మంజూరు చేసింది. డివిజన్‌లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు వర్షపు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో యూజీడీ, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు ఈ నిధులను కేటాయించారు.

మంజూరైన మొత్తం నిధుల్లో యూజీడీ పనులకు రూ.2.86 కోట్లు కేటాయించగా, స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులకు రూ.2.24 కోట్లు కేటాయించారు. ఈ పనులు పూర్తయితే డివిజన్‌లో మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుపడటంతో పాటు వర్షాకాలంలో నీటి నిల్వలు, వరదనీటి సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాగారం డివిజన్ అధ్యక్షుడు భూమయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

నాగారం డివిజన్ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు.

అభివృద్ధి పనులకు రూ.5.11 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, నిధుల మంజూరుకు కృషి చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్‌కు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.