prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:20 pm Digital Edition : PRAJA VANI

నల్లగొండ లో జరిగే అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి

నల్లగొండ లో జరిగే అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి : సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్లగొండ లో నవంబర్ 15 నుండి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్ ) 36 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. గురువారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో అఖిల భారత కిసాన్ సభ 36వజాతీయ మహాసభల జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను ఇంటింటి తిరిగి పంచుతూ, విరాళాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి 80 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వీర తెలంగాణ పోరాటానికి కేంద్రంగా నిలిచిన నల్లగొండలో జాతీయ మహాసభలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వలస కార్మికులు రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం వలన రైతులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్ డమ్ తదితర దేశాలతో కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాల వల్ల దిగుమతి సుంకాలు లేకుండా పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, ధాన్యాలు, పాల ఉత్పత్తుల దేశంలోకి వస్తే భారత రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ధాన్యం నిల్వ సౌకర్యాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం ద్వారా వ్యవసాయ రంగంలో గుత్తాధిపత్యానికి అవకాశం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, వ్యవసాయానికి సబ్సిడీలు పెంచాలని, రైతులను రుణ విముక్తులు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు, పోరాటాలు కొనసాగిస్తామని వారు తెలిపారు. నల్లగొండలో జరిగే అఖిల భారత రైతు మహాసభలు విజయవంతం చేసేందుకు శ్రేయోభిలాషులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆర్థిక, హార్దిక సహకారం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిబల్లెం స్వామి,నారపాక శంకరయ్య, బొమ్మరగోని నరసింహ, బుగ్గమ్మ, సత్తమ్మ, యాదయ్య, బొమ్మరగోని నరసింహ, ప్రజలు శ్రీపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.