prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 1:47 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

తొర్రూరు మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి

తొర్రూరు మండల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడల యశస్విని రెడ్డి

 

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తొర్రూరు మండలానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో పాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులతో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తొర్రూరు మండలంలోని గ్రామాల వారీగా అభివృద్ధి పనుల పురోగతి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు తదితర అంశాలపై ఎమ్మెల్యే అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను గుర్తించి సత్వరమే పరిష్కారం చూపాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్యుత్, విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఎమ్మెల్యే నొక్కి చెప్పారు. ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులు ఎక్కడా ఆలస్యం కాకుండా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో చర్చించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
తొర్రూరు మండలాన్ని అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం ఎంతో కీలకమని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని ప్రజాప్రతినిధులకు సూచిస్తూ, ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమీక్ష సమావేశంలో తొర్రూరు మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.