prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 2:02 am Digital Edition : MAHESH MEDCHAL

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి జీ.పరమేష్

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: జీ. పరమేష్
పూడూరు ముదిరాజ్ సంఘం వద్ద ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు
అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలి
పూడూరు, సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని పూడూరు ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు జీ. పరమేష్ కోరారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పూడూరు–కిష్టాపూర్ డివిజన్ పూడూరు గ్రామంలోని ముదిరాజ్ సంఘం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జీ. పరమేష్ మాట్లాడుతూ.. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించినప్పటికీ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కాకపోవడంతో తెలంగాణ ప్రాంత ప్రజలు మరో ఏడాది పాటు ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొన్నారని తెలిపారు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతానికి విముక్తి లభించిందన్నారు.
నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని పరమేష్ తెలిపారు. నైజాం పాలనలో రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా ప్రజలు, పోరాట యోధులు ధైర్యంగా ఉద్యమించారని, స్వేచ్ఛ, హక్కుల కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు.
తెలంగాణ విమోచన కోసం పోరాడిన వీరుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. చారిత్రక సంఘటనలను భావితరాలకు అందించేందుకు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం ద్వారా ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయవచ్చన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, అమరవీరులను స్మరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ముదిరాజ్ యువజన సంఘం ఉపాధ్యక్షులు నీరుడి శ్రీరామ్, పుట్నాల గౌతమ్, మాజీ సర్పంచ్ బాబు యాదవ్, మాజీ ఎంపీటీసీ నీరుడి రఘు, మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు తుపాకుల కృష్ణ, కోలా వెంకటేష్, శేఖర్ రెడ్డి, సోమేష్, సంఘం సభ్యులు వెంకట్, లచ్చు, నర్సింహా, మర్రిచెట్టు ప్రసాద్, గుడిసె నర్సింహా, కొండ శ్రీనివాస్, మేకల కృష్ణ, తిరుమణి రమేష్, శ్రీనివాస్, సాడే రాజు, నాయకులు అనంత్ రెడ్డి, కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.