చిత్తూరు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు
మన ప్రజావాణి
పలమనేరు, సెప్టెంబరు
చిత్తూరు జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమాపతి నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం పలమనేరు ఆర్డీఓకు రైతాంగ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
సకాలంలో వర్షాలు కురవక భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, తాగు, సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండిపోవడంతో రైతులు పెట్టుబడులు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి యుద్ధప్రాతిపదికన కరువు సహాయ చర్యలు చేపట్టాలని కోరారు.పశుగ్రాస కొరత నివారణకు మండలాల వారీగా పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గ్రామాల్లో పశువులకు నీటి తొట్టెలు నిర్మించాలని డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువులు, కుంటలను నింపాలని కోరారు. కరువు కారణంగా దెబ్బతిన్న పంటలకు ఇన్పుట్ సబ్సిడీ అందించడంతో పాటు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు.విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లను పూర్తి సబ్సిడీతో అందించాలని కోరారు. కౌండిన్యా నదిలో పాడైన చెక్డ్యామ్లను పునరుద్ధరించి, పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నదులు, చెరువులు, కుంటల్లో ఇసుక, మట్టి తవ్వకాలను నిలిపివేయాలని కోరారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి పని దినాలు, వేతనాలు పెంచాలని, మామిడి తదితర ఉద్యాన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని తెలిపారు. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో రైతు నాయకులు మోహన్రెడ్డి, వాసు, సుబ్రమణ్యంరెడ్డి, జానకిరాము, వాసుదేవరెడ్డి, రవీంద్రారెడ్డి, భాస్కర్గౌడు, చలపతి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.