prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 6:09 pm Digital Edition : PRAJA VANI

ఘనంగా సెలెస్టియల్ హై స్కూల్ గణేష్ నిమజ్జనం

ఘనంగా సెలెస్టియల్ హై స్కూల్ గణేష్ నిమజ్జనం

•••పాఠశాల కారస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో.

•••తిలక్ స్ఫూర్తి తో గణేష్ ఉత్సవాలు.

సిరిసిల్ల,ప్రజావాణి

సిరిసిల్ల పట్టణంలోని అశోక్‌నగర్‌లో గల సెలెస్టియల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఆదివారం గణేష్ నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ముందుగా విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ రకాల పిండి వంటకాలతో వినాయకుడికి నైవేద్యం సమర్పించారు. అనంతరం పాఠశాల నుంచి గణేష్ విగ్రహంతో శోభాయాత్ర ప్రారంభమైంది. నేతన్న విగ్రహం మీదుగా అంబేద్కర్–గాంధీ చౌక్ చేరుకుని అక్కడి నుంచి మానేరు తీరం వరకు ఊరేగింపు కొనసాగింది.
సుమారు 200 మంది విద్యార్థినీ, విద్యార్థులు భక్తిగీతాలకు నృత్యాలు చేస్తూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం మానేరు తీరంలో గణేష్ విగ్రహానికి నిమజ్జనం నిర్వహించారు. నిమజ్జనం అనంతరం అన్నదాన కార్యక్రమంలో భాగంగా భక్తులకు పులిహోరను పంపిణీ చేశారు.

*తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు*

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 1893లో బాలగంగాధర్ తిలక్ ఇంటికే పరిమితమైన గణేష్ పూజను సార్వజనీన గణేష్ ఉత్సవంగా మార్చారని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయుల్లో జాతీయ భావన, ఐక్యతను పెంపొందించేందుకు, కులమతాలకు అతీతంగా ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి స్వాతంత్ర్య కాంక్షను రగిలించేందుకు తిలక్ గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.గణేష్ ఉత్సవాల ద్వారా విద్యార్థుల్లో భక్తితో పాటు ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్, ప్రిన్సిపాల్ మచ్చ ఇందిర, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.