*ఘనంగా ప్రజాపాలన దినోత్సవం*
••• పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.
•• జెండాను ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితె కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.జిల్లాలో రైతు భరోసా కింద రూ.149 కోట్లకు పైగా, రైతు రుణమాఫీ కింద రూ.370 కోట్లకు పైగా నిధులు అందించినట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి, మహాలక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు ప్రయోజనం కల్పిస్తున్నామన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 7,088 ఇళ్లు మంజూరు కాగా, 3,797 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు భారీగా నిధులు మంజూరు చేసి పనులు వేగంగా కొనసాగిస్తున్నామన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊతమిస్తూ ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్ల ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. నేతన్న పొదుపు, భద్రత పథకాల ద్వారా కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు, వైద్య రంగంలో మెరుగైన సేవలు, యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు జిందం కళ, పుల్కం రాజు, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, డీఆర్వో జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్బీ కుమారి, డీఎస్పీలు నాగేంద్రాచారి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.