prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:13 am Digital Edition : MINIPALLYNARESH KUKATPALLY

గురుదక్షిణ గొప్ప ఆలోచన  రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు  సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో భిన్నంగా గురుపూజోత్సవం అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుదక్షిణ పేరుతో పుస్తక ఆవిష్కరణ

 

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో గురుపూజోత్సవ వేడుకలు భిన్నంగా జరిగాయి. గురుదక్షిణ కవితా సంకలనం పేరుతో పుస్తకాన్ని ముద్రించి యూనివర్సిటీకి చెందిన జర్నలిజం విద్యార్థులు గురువులకు అంకితం చేశారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రిజిస్ట్రార్ హనుమంతరావు మాట్లాడుతూ కేవలం వారం రోజుల్లోనే.. చక్కటి కవితలతో అందమైన డిజైన్ తో అంత మంచి పుస్తకం తీసుకొచ్చారంటే.. వీరు భవిష్యత్తులో మరిన్ని మంచి పుస్తకాలు తీసుకొస్తారని, తీసుకురావాలని ఆకాంక్షిస్తూ సంపాదకులు కొండూరి కోటి బాబు, ఎస్. కళ్యాణ్ దాస్, నాగుల అంజిబాబులను అభినందించారు. ఈ పుస్తకానికి ఆర్థిక సహకారం అందించేందుకు అంజిబాబు ఫౌండేషన్ ముందుకు రావడం సంతోషదగ్గ విషయమన్నారు. గురువుల గొప్పదనాన్ని చాటేలా పుస్తకం ఉందని, తమ యూనివర్సిటీ విద్యార్థులు మంచి ప్రయత్నం చేశారని అభినందించారు. గురుపూజోత్సవం సందర్భంగా తనని ఇంతటి వారిని చేసిన తన గురువులను గుర్తు చేసుకుంటూ, తన అనుభవాలను వివరించారు. ఒక్కో టీచర్ లో, ఒక్కో డిఫరెంట్ టాలెంట్ ఉంటుందని తెలిపారు. నేటి కాలంలో కూడా గురువుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ గౌరవించుకోవడం మంచి సంప్రదాయమని అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటామని, మనిషి జీవితంలో ఎందరో గురువులు ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థుల అభిప్రాయాల్ని, వాళ్లకు తెలిసిన విషయాల్ని చెప్పే అవకాశం ఇస్తూ, టీచర్ కూడా విద్యార్థుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. తెలుగు యూనివర్సిటీ విద్యార్థులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 60 మంది కవులు గురువుల గొప్పదనం చాటుతూ చక్కటి కవితలను ఈ పుస్తకంలో అక్షరీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ అధ్యాపకులను సత్కరించారు.

అంజిబాబు ఫౌండేషన్ కు అభినందనలు

విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన గురుదక్షిణ కవితా సంకలనానికి ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన అంజిబాబు ఫౌండేషన్ ను రిజిస్ట్రార్ హనుమంతరావు అభినందించారు. మున్ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సీఈవో ఫౌండర్ అంజిబాబుకు సూచించారు.

త్రిమూర్తుల గురుదక్షిణ అభినందనీయం

జర్నలిజం విభాగం తరఫున సీనియర్ అధ్యాపకురాలు షేక్ హసీనా మాట్లాడుతూ.. గురుదక్షిణ కవితా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించిన త్రిమూర్తులు కోటి బాబు, అంజిబాబు కళ్యాణ్ ల కృషి అభినందనీయం అన్నారు. త్రిమూర్తులుగా అభివర్ణించారు. మంచి కార్యక్రమానికి అధ్యాపకుల సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రధాన సంపాదకులు కోటి బాబు మాట్లాడుతూ గురుదక్షిణ పుస్తకం తీసుకువచ్చేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన వీసీ, రిజిస్ట్రార్, జర్నలిజం విభాగం శాఖాధిపతి, అధ్యాపకులకు, గురువుల గొప్పతనాన్ని చాటుతూ కవితలను రాసిన కవులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్బంగా అంజిబాబు ఫౌండేషన్ సీఈఓ నాగుల అంజిబాబు మాట్లాడుతూ అంజిబాబు ఫౌండేషన్ ద్వారా చేస్తున్న మొదటి కార్యక్రమం గురుపూజోత్సవం రోజు జరగటం ఆనందదాయకమని, తన విద్యావంతుడు కావటానికి సహకరించిన గురువులందరికి తాను సమర్పించే గురుదక్షిణగా, ఈ గురుదక్షిణ పుస్తకానికి అంజిబాబు ఫౌండేషన్ సహకరించటం తను తన గురువులకు సమర్పించే గురుదక్షిణ అని తెలియజేశారు.

సంపాదకుడు కళ్యాణ్ దాస్ మాట్లాడుతూ ఈ గురుదక్షిణ కవితా సంకలనానికి సంపాదకుడుగా ఉండటం గర్వకారణమని, గురుదక్షిణకు స్వల్ప కాలంలోనే విశేష స్పందనతో కవులు స్పందించి కవితలు రాసి పంపటం, గురుదక్షిణ రోజే, పుస్తకాన్ని ఆవిష్కరించాలని లక్ష్యంతో శ్రమించామని, కవితలు రాసిన కవులందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వందన సమర్పణతో ముగించారు. ఈ కార్యక్రమంలో సంగీత విభాగం ఆచార్యులు బి. రాధ, ఓ. విజయ్, జర్నలిజం, తెలుగు ఇతర విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.