prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:37 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

గీతా విద్యాలయము లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని చందూర్‌లోని గీతా విద్యాలయం పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, రాధ వేషధారణలతో సందడి చేయడంతో పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వేడుకల్లో విద్యార్థులకు శ్రీకృష్ణ, రాధ వేషధారణ పోటీలు, భజనలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులు సంప్రదాయ దుస్తుల్లో శ్రీకృష్ణుడి జీవిత విశేషాలను, ఆయన బోధించిన ధర్మాలను తమ ప్రదర్శనల ద్వారా చాటిచెప్పారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పోలోజు నరసింహ చారి మాట్లాడుతూ, శ్రీకృష్ణుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, భగవద్గీత ద్వారా ఆయన అందించిన కర్తవ్యనిష్ఠ, ధర్మం, సత్యం, నైతిక విలువలు నేటి విద్యార్థులకు ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థుల విద్యతో పాటు మంచి సంస్కారం, క్రమశిక్షణ, మానవతా విలువలను అలవర్చుకుని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేయడం ద్వారా వారిలో సాంస్కృతిక విలువలను పెంపొందించుకోవాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. శ్రీకృష్ణాష్టమి వంటి పర్వదినాలను పాఠశాల స్థాయిలో నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఐక్యత, సృజనాత్మకత, ఆధ్యాత్మిక భావనలతో పాటు మన సంస్కృతిపై గౌరవం పెరుగుతోంది. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను, విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులను ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.