prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 1:59 pm Digital Edition : PRAJA VANI

గిరిజనులకు స్వర్ణయుగం

గిరిజనులకు స్వర్ణయుగం
కేసీఆర్‌ పాలనలో….
బీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్‌
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్‌ 17, ప్రజావాణి:
కేసీఆర్‌ పాలన గిరిజనులకు స్వర్ణయుగం లాంటిదని బీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్‌ అన్నారు. లంబాడీల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన కేసీఆర్‌ను గిరిజనులు జీవితాంతం మరువకూడదన్నారు.

తండాలకు గ్రామపంచాయతీ హోదా

కురవి మండలంలోని ఎలుకచెట్టు తండా, బాల్యతండా గ్రామపంచాయతీల్లో గురువారం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. లంబాడీలకు రిజర్వేషన్‌ పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా తండాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘మా తండాలో మా రాజ్యం’ అనే నినాదంతో గిరిజనులు చేసిన పోరాటాన్ని గుర్తించి 3,146 తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

బంజారా భవన్‌ నిర్మాణం

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో బంజారా భవన్‌ నిర్మించి లంబాడీల ఆత్మగౌరవాన్ని పెంచారని రవినాయక్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పైగా పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకున్నారని అన్నారు.
మిషన్‌ భగీరథతో తాగునీరు
కిలోమీటర్ల దూరం నడిచి తాగునీరు తెచ్చుకునే గిరిజన మహిళల ఇబ్బందులను గుర్తించి మిషన్‌ భగీరథ పథకాన్ని అమలు చేశారని తెలిపారు. కళ్యాణలక్ష్మి పథకంతో గిరిజన కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు.

రిజర్వేషన్లు కల్పించిన ఘనత

వ్యవసాయ మార్కెట్లలో, మద్యం దుకాణాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని రవినాయక్‌ అన్నారు. సేవాలాల్‌ జయంతిని అధికారికంగా నిర్వహించిన ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

ఎస్టీ డిక్లరేషన్‌ అమలు చేయాలి

చేవెళ్లలో ప్రకటించిన ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోందని రవినాయక్‌ విమర్శించారు. సేవాలాల్‌ కార్పొరేషన్‌కు ఇప్పటివరకు సరైన కార్యాచరణ లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
కార్యక్రమాల్లో ఎలుకచెట్టు తండా సర్పంచ్‌ మాలోత్‌ రమేష్‌ నాయక్‌, బాల్యతండా సర్పంచ్‌ బానోత్‌ సునీత రాందాస్‌, ఉపసర్పంచ్‌ బానోత్‌ యాకయ్య, వార్డు సభ్యులు, తండా పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.