గణపయ్య సన్నిధిలో భక్తుల కోలాటం
ప్రజావాణి – కూసుమంచి, సెప్టెంబర్ 17:
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపయ్య సన్నిధిలో భక్తులు కోలాటం నృత్యాలతో సందడి చేశారు. వినాయక మండపం వద్ద రంగురంగుల విద్యుత్ దీపాలంకరణల మధ్య మహిళలు, యువతులు ఉత్సాహంగా కోలాటం ఆడుతూ భక్తి భావాన్ని చాటుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు కర్రలతో తాళానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. గణనాథుడి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని భక్తులు కోరుకున్నారు. మండపం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువత ఆధ్వర్యంలో పండుగ వాతావరణం నెలకొంది. కోలాటం నృత్యాలతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తి, ఆనందోత్సాహాల మధ్య గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గ్రామ ప్రజలు ఐకమత్యంతో పండుగను జరుపుకుంటూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. యువత అసోసియేషన్ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.