కూకట్పల్లి ప్రైమరీ స్కూల్ రోడ్డుపై ఆక్రమణలు.. పిల్లలకు భయానక పరిస్థితులు!
రోడ్డుపైనే చెరుకు బండి, చికెన్ పకోడీ సెంటర్లు.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం
అక్రమ ఆక్రమణలు తొలగించి విద్యార్థులు, బస్తీవాసులకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్
కూకట్పల్లి, సెప్టెంబర్ 19 (ప్రజావాణి)
కూకట్పల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్కు వెళ్లే రహదారిపై చిరు వ్యాపారాలు, బండ్లు ఏర్పాటు చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరుకు బండి, చికెన్ పకోడీ సెంటర్ తదితర వ్యాపారాలను రోడ్డుపైనే ఏర్పాటు చేయడంతో టూ వీలర్లు, ఫోర్ వీలర్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడి తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని చెబుతున్నారు.
ముఖ్యంగా ఉదయం వేళల్లో పాఠశాలకు వెళ్లే చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రహదారి ఇరుకుగా మారడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని స్థానికులు తెలిపారు. రోడ్డుపై మద్యం సేవిస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల పాఠశాల విద్యార్థులు, మహిళలు, బస్తీవాసులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
రోడ్డుపై వ్యాపారాలు పెట్టడంపై ప్రశ్నించిన స్థానికులతో కొందరు దురుసుగా మాట్లాడుతున్నారని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. “ప్రజా రహదారిని ఎవరి ఇష్టానుసారం ఆక్రమించడానికి వీల్లేదు” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించాలి
పాఠశాల పరిసరాల్లో రహదారి ఆక్రమణలను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై ఏర్పాటు చేసిన బండ్లు, సెంటర్లను తొలగించాలని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను కోరుతున్నారు. విద్యార్థులు సురక్షితంగా పాఠశాలకు వెళ్లేలా, బస్తీవాసులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రహదారిని ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.