*కిష్టాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో టీడీ టీకా శిబిరం పరిశీలన*
*అర్హులైన విద్యార్థినులందరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలి: డా.కె.ఆనంద్*
మేడ్చల్, సెప్టెంబర్ 17: మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.కె.ఆనంద్ మేడ్చల్ మండలం కిష్టాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న టీడీ టీకా శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా టీకా కార్యక్రమం నిర్వహణ తీరును, విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను ఆయన సమీక్షించారు. టీకా శిబిరంలో విద్యార్థినుల హాజరు, టీకాకు అర్హులైన విద్యార్థినుల గుర్తింపు, టీకా లబ్ధిదారుల జాబితా, టీకా రిజిస్టర్ నిర్వహణ, టీకా వివరాల ఆన్లైన్ నమోదు తదితర అంశాలను డా. ఆనంద్ పరిశీలించారు. అలాగే వ్యాక్సిన్ క్యారియర్, కోల్డ్ చైన్ నిర్వహణ, సిరింజ్ల వినియోగం, టీకా అనంతరం ఉత్పన్నమయ్యే వ్యర్థాల సేకరణ, నిర్వహణ విధానాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డా.కె.
ఆనంద్ మాట్లాడుతూ టీకా కార్యక్రమంలో అర్హులైన విద్యార్థినులందరికీ టీడీ టీకా అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. టీకా వేసే ముందు ప్రతి విద్యార్థినీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన వివరాలను నమోదు చేయాలని తెలిపారు. టీకా అనంతరం విద్యార్థినులకు ఏవైనా అసౌకర్య లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. వ్యాక్సిన్ల నాణ్యతను కాపాడేందుకు నిర్దేశిత ఉష్ణోగ్రతలో వాటిని భద్రపరచాలని, వ్యాక్సిన్ క్యారియర్లో సరైన కోల్డ్ చైన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. టీకా సీసాలను వినియోగించే ముందు వాటి గడువు తేదీ, బ్యాచ్ నంబర్ తదితర వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. టీకా శిబిరంలో అవసరమైన సిరింజ్లు, పత్తి, వ్యర్థాల సేకరణ బాక్సులు, అత్యవసర వైద్య సామగ్రి ముందుగానే అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఉపయోగించిన సిరింజ్లు, ఇతర వైద్య వ్యర్థాలను నిబంధనల ప్రకారం సురక్షితంగా సేకరించి, శాస్త్రీయ పద్ధతిలో పారవేయాలని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టీకా కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని డా. ఆనంద్ వైద్య సిబ్బందికి సూచించారు.