prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 8:27 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కడప జిల్లాలో ఘోర ప్రమాదం: సిద్ధవటం వంతెనపై మినీ లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం!

 కడప జిల్లా సిద్ధవటం సెప్టెంబర్ 13 ప్రజావాణి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్ధవటం హైలెవెల్ వంతెనపై వేగంగా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం,ఒక మినీ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై పడి తీవ్ర రక్తస్రావంతో నరకయాతనను అనుభవించారు.గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.బద్వేల్ వైపు నుండి కడప వైపునకు ఒక మినీ లారీ వస్తోంది. అదే సమయంలో సిద్ధవటం వంతెనపై ప్రయాణిస్తున్న ఇరువురు ద్విచక్ర వాహనదారులు, ఎదురుగా వస్తున్న సదరు మినీ లారీని ఊహించని విధంగా బలంగా ఢీకొట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో వేగం ఎక్కువగా ఉండటంతో, బైక్ లారీని ఢీకొట్టిన వెంటనే దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాల్లోకి ఎగిరి వంతెనపై కింద పడ్డారు. ఈ ప్రమాద దాటికి వారి తలలకు, కాళ్లకు, చేతులకు తీవ్రమైన గాయాలయ్యాయి. రహదారి అంతా రక్తసిక్తంగా మారింది.

స్పందించిన స్థానికులు – కడప రిమ్స్‌కు తరలింపు

ప్రమాదం జరిగిన వెంటనే వంతెనపై వెళ్తున్న తోటి వాహనదారులు, స్థానికులు మానవత్వంతో స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పరిశీలించి, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర రక్తస్రావంతో స్పృహతప్పి పడిపోయిన బాధితులను అత్యవసర చికిత్స నిమిత్తం వెంటనే కడప రిమ్స్  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరిలో ఒకరి తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

రంగంలోకి దిగిన సిద్ధవటం పోలీసులు

ప్రమాదంపై సమాచారం అందుకున్న సిద్ధవటం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వంతెనపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సిద్ధవటం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. బాధితులు ఎవరు? వారు ఎక్కడి నుండి వస్తున్నారు? అనే పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. వంతెనపై వాహనాల అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.