prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 2:28 pm Digital Edition : PRAJA VANI

ఓటు హక్కు జోలికొస్తే సహించేది లేదు మొలుగు ఆనంద్ రావు

ఓటు హక్కు జోలికొస్తే సహించేది లేదు మొలుగు ఆనంద్ రావు

నిజమైన ఓటర్ల పేర్లు తొలగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు

కూకట్‌పల్లి శ్రీ సీతారామ చంద స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మొలుగు ఆనంద్ రావు

కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి)సెప్టెంబర్ 13

కూకట్పల్లి : ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని కూకట్‌పల్లి శ్రీ సీతారామ చంద స్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మొలుగు ఆనంద్ రావు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఓటు హక్కుతో అధికారులు చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, SIR ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యానికి వెంటనే తెరదించాలని డిమాండ్ చేశారు.
నిజమైన ఓటర్ల పేర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించకూడదని ఆయన స్పష్టం చేశారు. దొంగ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లను నిబంధనల ప్రకారం పూర్తి ఆధారాలు పరిశీలించిన తర్వాతే తొలగించాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన పౌరుల హక్కులను హరించే ప్రయత్నాలు జరిగితే ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో వెంటనే పరిశీలించుకోవాలని మొలుగు ఆనంద్ రావు పిలుపునిచ్చారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా ఇంటింటికీ వెళ్లి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పారదర్శకంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా తయారీలో రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 22A భూవ్యవహారాలపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో విలువైన ప్రైవేట్ భూములను 22A జాబితాలో చేర్చి యజమానులను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని కోరారు. భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
అధికారుల వైఖరిలో మార్పు రాకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో భారీ ఆందోళన చేపడతామని మొలుగు ఆనంద్ రావు హెచ్చరించారు. అవసరమైతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ప్రజల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఓటు హక్కు, భూమి హక్కులను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.