prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 12:00 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఓఆర్‌ఆర్‌ ఘన్‌పూర్‌ ఎగ్జిట్‌ వద్ద ఐషర్‌ లారీలో మంటలు….రూ.16 లక్షల ఆస్తి నష్టం.. డ్రైవర్‌ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

ఘట్కేసర్‌, సెప్టెంబర్‌ 8: ఓఆర్‌ఆర్‌ ఘన్‌పూర్‌ ఎగ్జిట్‌ వద్ద ఐషర్‌ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. డ్రైవర్‌ అప్రమత్తంగా వ్యవహరించి వాహనం నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది.

పోలీసుల వివరాల ప్రకారం.. నవత రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిప్యూటీ మేనేజర్‌ కె.వి.ఎస్‌.వి. ప్రసాద్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు, సెప్టెంబర్‌ 7న ఆటోనగర్‌ నుంచి నాచారం వైపు వివిధ రకాల సరుకులతో 10 టైర్ల ఐషర్‌ లారీ (ఏపీ16టీఎక్స్‌7157) బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఘట్‌కేసర్‌ పరిధిలోని ఘన్‌పూర్‌ ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నంబర్‌ 9 వద్దకు చేరుకోగానే ఇంజిన్‌ నుంచి మంటలు రావడాన్ని డ్రైవర్‌ కె. శ్యామలరావు గమనించాడు.

వెంటనే లారీని రోడ్డు పక్కన నిలిపి కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే కొద్దిసేపటికే మంటలు ఇంజిన్‌, క్యాబిన్‌ నుంచి కంటైనర్‌కు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘట్‌కేసర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.

అగ్నిప్రమాదంలో లారీలోని బియ్యం, పుస్తకాలు, గృహోపకరణాలు, పాత మోటార్లు, స్క్రాప్‌ వైర్‌, పురుగుమందులు, బట్టల బేళ్లు తదితర సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సరుకుల విలువ సుమారు రూ.12.90 లక్షలు కాగా, లారీ ఇంజిన్‌, క్యాబిన్‌, ముందు టైర్లు, కంటైనర్‌ దెబ్బతినడంతో మరో రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు.

విద్యుత్‌ వైరింగ్‌లో షార్ట్‌సర్క్యూట్‌ లేదా సాంకేతిక లోపం కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.