•ఎస్ఓటీ పేరుతో దోపిడీ.. ఇద్దరు అరెస్ట్.. ఒకరు పరారీ!
•మహిళపై దాడి.. రూ.1.07 లక్షలు కాజేసిన నకిలీ పోలీసులు
పటాన్చెరు, సెప్టెంబర్ 7 (ప్రజావాణి):ఎస్ఓటీ సిబ్బంది అని చెప్పి ఓఇంట్లోకి చొరబడి మహిళను బెదిరించి, దాడి చేసి నగదు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను దోచుకున్న ఘటనలో ఇద్దరు నిందితులను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని ముత్తంగి గ్రామం సనా వెంచర్లో సెప్టెంబర్ 2న ముగ్గురు వ్యక్తులు తాము ఎస్ఓటీ సిబ్బందిమని చెప్పి ఓ ఇంట్లోకి ప్రవేశించారు. గుర్తింపు కార్డులు చూపించాలని కోరిన మహిళను బెదిరించి తల, మెడపై దాడి చేశారు. అనంతరం ఇంట్లోని అల్మారాను పగులగొట్టి రూ.70 వేల నగదును అపహరించారు.
అంతటితో ఆగకుండా బాధితురాలి మొబైల్ ఫోన్ ద్వారా యూకో బ్యాంకు ఖాతా నుంచి రూ.24,500, ఫెడరల్ బ్యాంకు ఖాతా నుంచి రూ.13 వేల చొప్పున మొత్తం రూ.37,500 బదిలీ చేసుకున్నారు. మొత్తం రూ.1.07 లక్షలను కాజేసి, ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మహిళను బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సేకరించిన ఆధారాల ఆధారంగా సెప్టెంబర్ 6న లింగంపల్లి వద్ద మొదటి నిందితుడు కొమటి విజయ్కుమార్, మూడో నిందితుడు కెరెల్లి యాదిరెడ్డిని అరెస్ట్ చేశారు. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నారు.
కాగా, ఈ కేసులో రెండో నిందితుడు మణిగండ్ల విజయ్కుమార్ అలియాస్ చిన్నా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయి. దోచుకున్న నగదు, బ్యాంకు ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
ఎవరైనా తమను పోలీసులు లేదా ఎస్ఓటీ సిబ్బంది అని చెబితే వారి ఐడి కార్డ్ ను నిర్ధారించుకున్న తర్వాతే ఇంట్లోకి అనుమతించాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.