prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 4:29 pm Digital Edition : PRAJA VANI

ఉలవ విత్తనాలకు భారీ సబ్సిడీ

ఉలవ విత్తనాలకు భారీ సబ్సిడీ

80 శాతం సబ్సిడీపై 400 క్వింటాళ్ల విత్తనాలు.. నేటి నుంచి ఆర్బీకేల్లో పంపిణీ

మన ప్రజావాణి
చౌడేపల్లి, సెప్టెంబర్ 17:

ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగును ప్రోత్సహించేందుకు చౌడేపల్లి మండలానికి 400 క్వింటాళ్ల ఉలవ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. 80 శాతం సబ్సిడీపై ఈ విత్తనాలను శుక్రవారం (18వ తేదీ) నుంచి మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయాధికారి మోహన్ కుమార్ తెలిపారు.

రూ.840 బస్తా.. రైతు చెల్లించేది రూ.148

10 కిలోల ఉలవ విత్తనాల బస్తా పూర్తి ధర రూ.840 కాగా, ప్రభుత్వం రూ.592 సబ్సిడీ అందిస్తోంది. దీంతో రైతు తన వాటాగా కేవలం రూ.148 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 10 కిలోల విత్తనాలు ఒక ఎకరా భూమిలో విత్తుకోవడానికి సరిపోతాయని అధికారులు తెలిపారు.

పత్రాలతో ఆర్బీకేకు..

ఉలవ విత్తనాలు అవసరమైన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్‌తో పాటు ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను వెంట తీసుకుని తమ పరిధిలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి విత్తనాలను పొందాలని సూచించారు.

విత్తనాలను ఇతర అవసరాలకు వాడొద్దు

పంపిణీ చేస్తున్న ఉలవ విత్తనాలను ఇప్పటికే రసాయన మందులతో విత్తన శుద్ధి చేసి ఉన్నందున వాటిని ఆహారంగా లేదా ఇతర అవసరాలకు వినియోగించరాదని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటగా ఉలవ సాగు చేపట్టాలని కోరారు.