ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ ఇచ్చేస్తా..?
జిల్లెల్ల పంచాయతీ కార్యదర్శి రవీందర్ పనితనం బట్టబయలు.
2024లో అవకతవకలపై విచారణ…. సదరు అధికారికి బుద్ధి చెప్పిన కలెక్టర్.
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికారులపై మరింత నిఘా పెట్టాలని ప్రజల విజ్ఞప్తి.
తంగళ్లపల్లి,ప్రజావాణి
ఇళ్లు లేని చోట ఇంటి నంబర్లు ఇస్తా… ఇంటి పన్ను రసీదులు జారీ చేస్తా అంటూ నిబంధనలను ఉల్లంఘిస్తూ 2024 లో రసీదు లు జారీ చేసినట్లు ఆరోపణలపై సదరు ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఉపయోగించారనే ఆరోపణలపై జిల్లెల్ల అప్పటి గ్రామపంచాయతీ కార్యదర్శి అకారపు రవీందర్ కు బుద్ధి చెబుతూ ప్రొసీడింగ్స్ జారీ చేసి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామ శివారులో ఎలాంటి భౌతిక నిర్మాణాలు లేనప్పటికీ ఇళ్లకు సంబంధించిన పన్ను రసీదులు జారీ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.సంబంధిత స్థలంలో నిర్మాణాలు లేవని క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. అయినప్పటికీ 2024లో ఇంటి పన్ను రసీదులు జారీ చేసి, అనంతరం ఆ రికార్డులను ఆస్తుల అమ్మకపు దస్తావేజుల రిజిస్ట్రేషన్కు ఉపయోగించినట్లు విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా హెచ్.నంబర్లు 6-158/1, 6-158/2కు సంబంధించిన పన్ను రసీదులు 26-05-2024న జారీ అయినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ సమయంలో రవీందర్ జిల్లెల్ల గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణలో విధుల పట్ల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దీంతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం రవీందర్ను తక్షణమే విధుల నుండి తప్పిస్తూ సస్పెండ్ చేస్తూ, ఆరోపణలపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో జిల్లా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని, నిబంధనల ప్రకారం జీవన భృతికి అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. మండలంలో ఇష్టానుసారంగా నిబంధన ఉల్లంఘిస్తున్న వారిపై కూడా నిఘా పెంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.