prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:21 pm Digital Edition : PRAJA VANI

అర్హులైన వారికి ఆసరా అందేలా అధికారుల చర్యలు

అర్హులైన వారికి ఆసరా అందేలా అధికారుల చర్యలు

కొత్త పింఛన్ల దరఖాస్తులపై ఇంటింటికీ వెళ్లి క్షేత్ర పరిశీలన

అర్హుల గుర్తింపే లక్ష్యంగా ఇంటింటికీ అధికారుల పర్యటన..

దరఖాస్తుదారుల కుటుంబ వివరాలపై క్షేత్రస్థాయి పరిశీలన..

ప్రభుత్వ నిబంధనల మేరకు భూమి, ఉద్యోగ వివరాల పరిశీలన..

పింఛన్ల ఎంపికలో పారదర్శకతకు అధికారుల ప్రత్యేక చర్యలు..

తిరుమలాయపాలెం,ప్రజావాణి,సెప్టెంబర్ 19:

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్లు అర్హులైన నిరుపేదలకు అందేలా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించేందుకు అధికారులు స్వయంగా ఇంటింటికీ వెళ్లి భౌతిక పరిశీలన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో పెన్షన్ పరిశీలన అధికారి అయిన మండల పంచాయతీ అధికారి షేక్ మీరా, పంచాయతీ కార్యదర్శి అంబాల అంజి దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుదారుల కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకోవడంతో పాటు కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా భూమి కలిగి ఉన్నారా, ఇతర అర్హతలు ఉన్నాయా అనే అంశాలపై వివరాలను సేకరించారు. దరఖాస్తుల్లో పేర్కొన్న సమాచారం, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి నమోదు చేశారు. ఈ విధంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలన చేపట్టడం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా, నిబంధనలకు విరుద్ధంగా అనర్హులకు పింఛన్లు మంజూరు కాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత, అర్హతకు ప్రాధాన్యం కల్పిస్తూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహిస్తున్నారు. దరఖాస్తుదారులు తమ వివరాలను అధికారులకు సక్రమంగా అందించి క్షేత్రస్థాయి పరిశీలనకు సహకరించాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి చేరేలా మండల అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ చేపడుతున్న ఈ క్షేత్రస్థాయి పరిశీలనకు గ్రామస్థుల నుంచి సహకారం లభిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు..