prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 3:26 pm Digital Edition : PRAJA VANI

అమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి

*అమర ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలి*

*పుస్తకాల విడుదలను నిలిపివేయాలని ప్రజాసంఘాల నాయకుల వినతి*

ఉమ్మడి రంగారెడ్డి. (ప్రజావాణి )మంచాల, సెప్టెంబర్ 16:
డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అవాస్తవ, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ అమర ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం. మంచాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజాసంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి అందించిన సేవలను వక్రీకరించేలా అమర ప్రసాద్ రచించినట్లు పేర్కొంటున్న పుస్తకాలను ప్రభుత్వం విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అంబేద్కర్‌ను కించపరిచేలా, ఆయన చరిత్రను వక్రీకరించేలా ఎలాంటి ప్రచారం జరిగినా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

భారత రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని వారు పేర్కొన్నారు. గతంలో అణగారిన వర్గాలు విద్య, సామాజిక హక్కులకు దూరంగా ఉన్న పరిస్థితుల నుంచి నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో గౌరవంగా జీవించే స్థాయికి రావడానికి రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు.

రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నాయకులు తెలిపారు. రాజ్యాంగం, అంబేద్కర్‌పై తప్పుడు ప్రచారం జరిగితే ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అభ్యుదయవాదులు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ అంశంపై స్పందించి, పుస్తకాల విడుదల విషయంలో తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.