prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 2:42 pm Digital Edition : PRAJA VANI

అధునాతన వైద్య సేవల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మరో మైలురాయి

అధునాతన వైద్య సేవల్లో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మరో మైలురాయి

మూడు క్లిష్ట కేసులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, సెప్టెంబర్ 14

పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్యం లభిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మూడు క్లిష్ట కేసులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ తెలిపారు.

మోకాలి ఇన్ఫెక్షన్‌కు చర్మ మార్పిడి

మంథని మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వ్యక్తి ఎడమ మోకాలిలో తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో నెల రోజులుగా బాధపడుతూ పలు ఆసుపత్రులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవడంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స ద్వారా మోకాలిలో పేరుకుపోయిన చీమును తొలగించారు. అనంతరం ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గే వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు.

గాయం ఆరోగ్యకరమైన స్థితికి చేరుకున్న తరువాత కుడి తొడ భాగం నుంచి చర్మాన్ని సేకరించి ఎడమ మోకాలి ప్రాంతంలో చర్మ మార్పిడి (స్కిన్ గ్రాఫ్టింగ్) శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీంతో గాయం త్వరగా మానేందుకు, రోగి పునరావాసానికి మార్గం సుగమమైంది.

కాలేయంలోని చీముకు జిల్లాలో తొలిసారిగా అధునాతన చికిత్స

శివపల్లి గ్రామానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తి జ్వరం, వాంతులు, కళ్ల పచ్చబడటం, కడుపునొప్పి వంటి సమస్యలతో జిల్లా ఆసుపత్రికి వచ్చారు. వైద్య పరీక్షల్లో కాలేయంలో చీము ఏర్పడినట్లు గుర్తించారు. రోగి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు శస్త్రచికిత్స అవసరం లేకుండా అల్ట్రాసౌండ్ గైడెడ్ పైటెయిల్ క్యాథెటరైజేషన్ (అల్ట్రాసౌండ్ గైడడ్ ఫిగటైల్ కాతేతెరిసాషన్ ) విధానం ద్వారా కాలేయంలోని చీమును తొలగించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో జిల్లాలోనే తొలిసారిగా ఈ అధునాతన విధానాన్ని విజయవంతంగా నిర్వహించి, కాలేయంలోని చీమును తొలగించారు. ఈ చికిత్స ద్వారా రోగికి శస్త్రచికిత్స లేకుండానే ఉపశమనం కల్పించారు.

డయాబెటిస్ కారణంగా దెబ్బతిన్న కాలి బొటనవేలికి చికిత్స

కనగర్తి గ్రామానికి చెందిన 75 ఏళ్ల వ్యక్తి డయాబెటిస్ కారణంగా కాలి బొటనవేలు తీవ్రంగా దెబ్బతిని, కణజాలం చెడిపోవడంతో జిల్లా ఆసుపత్రికి వచ్చారు. వైద్యుల పరిశీలన అనంతరం ఇన్ఫెక్షన్‌కు గురైన కణజాలాన్ని తొలగించడంతో పాటు, ఇన్ఫెక్షన్ సోకిన మొదటి మెటాటార్సల్ ఎముకను (1స్ట్ మీటటార్సల్ ) విజయవంతంగా తొలగించారు.

వైద్య బృందానికి సూపరింటెండెంట్ అభినందనలు

ఈ మూడు క్లిష్టమైన శస్త్రచికిత్సలను ప్లాస్టిక్ సర్జన్ డా. అశోక్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. మొయినుద్దీన్, ఆర్థోపెడిక్ సర్జన్లు డా. కుమార్ గౌడ్, డా. శ్రీనివాస్ రెడ్డి, డా. మేఘన, డా. వినయ్, జనరల్ సర్జన్లు డా. సాయి ప్రసాద్, డా. రాము, అనస్థీషియా వైద్యులు డా. చంద్రశేఖర్, డా. రామ్‌తో పాటు నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించిన వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కె. శ్రీధర్ అభినందించారు.

ఈ సందర్భంగా డా. కె. శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా ఆసుపత్రి పెద్దపల్లిలో లాపరోస్కోపిక్ సర్జరీలు, లేజర్ చికిత్సలు, ఫిస్టులా చికిత్సలు, యూరాలజీ శస్త్రచికిత్సలు, ఆర్థ్రోస్కోపీ, క్యాటరాక్ట్ సర్జరీలు, రూట్ కెనాల్ చికిత్సలు, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వంటి అనేక అధునాతన వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

పెద్దపల్లి జిల్లా ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని,