అంబేద్కర్ను కించపరిస్తే ఊరుకునేది లేదు
హమారా వరప్రసాద్పై కఠిన చర్యలు తీసుకోవాలి
చౌడేపల్లిలో దళిత సంఘాల భగ్గుమన్న నిరసన.
మన ప్రజావాణి
చౌడేపల్లి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను వక్రీకరిస్తూ పుస్తకం రాశారంటూ హమారా వరప్రసాద్పై చౌడేపల్లి మండలంలోని దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంబేద్కర్ను అవమానించేలా వ్యాఖ్యలు, రచనలు చేయడాన్ని ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశాయి. శుక్రవారం స్థానిక మండల పరిషత్ పరిపాలన భవనం ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అంబేద్కర్ వంటి మహనీయుడిని కించపరిచే ప్రయత్నాలు పదేపదే జరుగుతున్నా ప్రభుత్వాలు తగిన స్థాయిలో స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హమారా వరప్రసాద్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, న్యాయస్థానం తీసుకున్న చర్యలు ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఎవరూ అంబేద్కర్ను అవమానించే సాహసం చేయకుండా చట్టపరమైన శిక్షలను మరింత కఠినతరం చేయాలని కోరారు. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు దళిత సంఘాలు ఐక్యంగా పోరాడుతాయని స్పష్టం చేశారు.
అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రెవెన్యూ అధికారి దొరస్వామికి అందజేశారు.
కార్యక్రమంలో సీపీఎం నాయకుడు డాక్టర్ చంద్ర, కుల వివక్ష పోరాట సమితి నాయకుడు వాసు, గుండ్లూరు కృష్ణమూర్తి, అంబేద్కర్ భవన నిర్మాణకర్త బ్యాంకు రెడ్డప్ప, చిన్నస్వామి, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.