దళిత రత్నం అవార్డు అందు
కున్న ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్య
ప్రముఖ ప్రజా గాయకుడు గిద్దె రాంనర్సయ్య కి దళిత రత్నం అవార్డు లభించిన సందర్భంగా శనివారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా దళిత రత్నం అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా గాయకుడిగా గిద్దె రాంనర్సయ్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో, సామాజిక సమస్యలపై అవగాహన కల్పించడంలో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఆయనకు దళిత రత్నం అవార్డు రావడం సంతోషం అని ఆమె పేర్కొన్నారు. కళారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజలకు విస్తృతమైన సేవ అందించాలని ఆకాంక్షించారు.
గిద్దె రాంనర్సయ్య మాట్లాడుతూ తన సేవలను గుర్తించి దళిత రత్నం అవార్డుతో సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనకు లభించిన ఈ గౌరవం మరింత బాధ్యతను పెంచిందని, ప్రజా సమస్యలు, సామాజిక చైతన్యంపై తన గళాన్ని మరింత బలంగా వినిపిస్తానని తెలిపారు. తనను ప్రోత్సహించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దళిత నాయకులు, గుండాల నరసయ్య ప్రజా సంఘాల నాయకులు, కళాకారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.