prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 10:07 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

పోరుమామిళ్లలో ప్రభుత్వ డాక్టర్ ‘శశి హాస్పిటల్’ దందా? అనుమతులపై వెల్లువెత్తుతున్న ప్రశ్నలు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైద్యాధికారులు!
పోరుమామిళ్ల,ఆగస్టు 13:వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల కేంద్రంలో నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ సర్కిల్ సమీపంలో కొత్తగా వెలిసిన‘శశి హాస్పిటల్’ఇప్పుడు స్థానికంగా పెను సంచలనంగా మారింది.ప్రభుత్వ సేవల్లో ఉంటూ,ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న ఒక బాధ్యతాయుతమైన గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.శశివర్ధన్ రెడ్డి ఈ ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రభుత్వ వైద్యుడే స్వయంగా ప్రైవేట్ వ్యాపారంలోకి దిగడం ఒకెత్తయితే,ఈ ఆసుపత్రికి కనీస చట్టపరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే కోణంలో వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ప్రజల్లో పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మారాయి. అసలు ఈ హాస్పిటల్‌కు అనుమతులు ఉన్నాయా?లేక ప్రభుత్వ అధికారి అన్న అండతో ఇష్టారాజ్యంగా నడుపుతున్నారా?అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రూల్స్ బ్రేక్.పర్మిషన్లు గాల్లోనేనా?
వైద్య రంగంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లేదా క్లినిక్ ప్రారంభించాలంటే కఠినమైన ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన లైసెన్సులు పొందడం తప్పనిసరి.సామాన్యుడు చిన్న క్లినిక్ పెడితే వంద నిబంధనలు పెట్టే అధికారులు,ఒక ప్రభుత్వ వైద్యాధికారి పెట్టిన‘శశి హాస్పిటల్’ విషయంలో ఎందుకు గుడ్డిగా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.స్థానికంగా సేకరించిన సమాచారం ప్రకారం,ఈ ఆసుపత్రిలో కింది కీలక అనుమతులపై తీవ్ర అపోహలు,సందేహాలు వ్యక్తమవుతున్నాయి:

బయో మెడికల్ వేస్ట్ (వైద్య వ్యర్థాల నిర్వహణ అనుమతి): ఆసుపత్రి నుండి ప్రతిరోజూ వెలువడే ప్రమాదకరమైన సూదులు, సిరంజీలు, రక్తం అంటిన కాటన్, మందుల సీసాలను ఎలా పారబోస్తున్నారు? కాలుష్య నియంత్రణ మండలి (PCB) నుండి దీనికి తగిన అనుమతి పత్రాలు ఉన్నాయా? వైద్య వ్యర్థాలను ఇష్టమొచ్చినట్లు పడేస్తే స్థానిక ప్రజల ఆరోగ్యం ఏమవ్వాలి?
ఫార్మసీ ఫారం 20, 21 (మందుల షాపు లైసెన్స్): శశి హాస్పిటల్ ఆవరణలో యథేచ్ఛగా మందుల విక్రయాలు, పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ కంట్రోల్ అథారిటీ నిబంధనల ప్రకారం ఫారం 20, ఫారం 21 లైసెన్సులు లేకుండా మందుల దుకాణం నడపడం నేరం. ఈ అనుమతులు ఈ ఆసుపత్రికి ఉన్నాయా?పాథాలజీ ల్యాబ్ సర్టిఫికెట్: రోగుల ప్రాణాలతో ముడిపడి ఉన్న రక్తం, మూత్రం మరియు ఇతర అత్యవసర పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌కు క్వాలిఫైడ్ టెక్నీషియన్, అధికారిక క్వాలిటీ సర్టిఫికెట్ ఉందా? లేక అరకొర నాలెడ్జ్ ఉన్నవారితో పరీక్షలు చేయిస్తూ రోగుల ప్రాణాల మీదకు తెస్తున్నారా?
*ఎఫ్.ఐ.ఆర్ & పోలీస్ సర్టిఫికెట్ వివాదం: ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసిన స్థలం లేదా భవనంపై గతంలో ఏవైనా ఎఫ్.ఐ.ఆర్ కేసులు నమోదయ్యాయా? వివాదాస్పద స్థలంలో ఆసుపత్రి ఎలా వెలిసింది? వీటికి సంబంధించిన పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఎందుకు బయటపెట్టడం లేదు?
*హాస్పిటల్ బ్లూప్రింట్ గల్లంతు: అత్యవసర సమయాల్లో రోగులను కాపాడేందుకు,ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం భవన నమూనా మున్సిపల్ లేదా పంచాయతీ అధికారుల నుండి ఆమోదం పొందాలి. అగ్నిప్రమాదాలు జరిగితే రోగుల రక్షణకు గల గ్యారెంటీ ఏంటి?

రక్షకుడే భక్షకుడైతే ఎలా? ప్రజల్లో తీవ్ర ఆగ్రహం!
ఒక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్‌గా ఉంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన డాక్టర్ పి.శశివర్ధన్ రెడ్డి, ఈ కనీస నిబంధనలను మరియు చట్టపరమైన పత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా,ప్రజలను అంధకారంలో ఉంచుతూ ఆసుపత్రిని ఎలా నడుపుతారని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.”అధికార బలం,ప్రభుత్వ హోదా ఉంటే చాలు.నిబంధనలను తుంగలో తొక్కవచ్చా?”అంటూ అంబేద్కర్ సర్కిల్ పరిసర ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.
జిల్లా వైద్యాధికారులు ఏం చేస్తున్నారు?
ఒక ప్రైవేట్ హాస్పిటల్ అన్ని అనుమతులతో నడుస్తుందో లేదో తనిఖీ చేయాల్సిన బాధ్యత జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులపై ఉంది. కానీ,పోరుమామిళ్ల నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్ వెలిసినా అధికారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఉన్న మర్మమేంటని స్థానికులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్ అనే పక్షపాతంతోనే అధికారులు వెనకేసుకొస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.తక్షణమే జిల్లా కలెక్టర్,వైద్యాధికారులు స్పందించి శశి హాస్పిటల్‌పై సమగ్ర విచారణ జరపాలని,బయో మెడికల్ వేస్ట్ నుండి బిల్డింగ్ బ్లూప్రింట్ వరకు అన్ని లైసెన్సులను బహిరంగ పరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టినందుకు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.