prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 9:09 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

15వ అంతస్తు నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి

ఘట్‌కేసర్, ఆగస్టు 8 (ప్రజా వాణి): మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పోచారం డివిజన్‌ పరిధిలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలోని 15వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తూ కిందపడిన ఓ భవన నిర్మాణ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

వరంగల్‌ జాతీయ రహదారిని ఆనుకుని హరిహర కన్స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాకతీయ అపార్ట్‌మెంట్స్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన వినోద్‌ అనే కార్మికుడు శనివారం అపార్ట్‌మెంట్‌ 15వ అంతస్తులో పెయింటింగ్‌ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలపాలైన వినోద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఎత్తైన భవనాలపై కార్మికులు పనిచేసే సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించారా? కార్మికులకు భద్రతా బెల్టులు, హెల్మెట్లు తదితర రక్షణ పరికరాలు అందించారా? లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తోటి కార్మికుల ఫిర్యాదు మేరకు లేబర్‌ కాంట్రాక్టర్‌ దుర్గాప్రసాద్‌, నిర్మాణ సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి విచారణను వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.