prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 7:54 pm Digital Edition : RUPAVATHRAMESH HUZURNAGARR

హుజూర్‌నగర్‌ లైబ్రరీకి మహర్దశ. రూ. 5 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్ లాల్‌ పవార్‌.

హుజూర్‌నగర్‌ లైబ్రరీకి మహర్దశ.

రూ. 5 లక్షలు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్ లాల్‌ పవార్‌.

గ్రంథాలయంలో మౌలిక వసతులపై ఆరా.

త్వరలోనే లైబ్రరీకి కొత్త హంగులు.

హుజూర్నగర్ ఆగస్టు 12 (ప్రజావాణి)

హుజూర్‌నగర్‌ పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం త్వరలోనే కొత్త హంగులు సంతరించు కోనుంది. బుధవారం జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్ లాల్‌ పవార్‌ డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథన్ జయంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రంథాలయంలోని వసతులను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులు, నిరుద్యోగుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 5 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్‌ గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. పుస్తకాల లభ్యత, తాగునీరు, ఫర్నిచర్, వెలుతురు వంటి సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయానికి వచ్చే పాఠకుల సంఖ్యకు అనుగుణంగా వసతులు పెంచాలని సూచించారు.
మౌలిక వసతులకు రూ. 5 లక్షలు లైబ్రరీలో సివిల్ వర్క్స్, పెయింటింగ్, అదనపు కుర్చీలు, టేబుళ్లు, తాగునీటి సౌకర్యం కోసం రూ. 5 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నిధులతో వెంటనే పనులు చేపట్టి, గ్రంథాలయాన్ని పాఠకులకు మరింత చేరువ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలని కోరారు.

కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ ఏడిఏ రవి, తహసిల్దార్ కవిత, గ్రంథాలయ సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.