బద్వేల్ రూరల్,ఆగస్టు 28 ప్రజావాణి కలసపాడు మండలంలో సంచలనం సృష్టించిన వృద్ధుడి హత్య కేసును అత్యంత చాకచక్యంగా,శరవేగంగా ఛేదించిన బద్వేల్ రూరల్ సర్కిల్ పరిధిలోని ఎఎస్ఐ నరసింహారావు ని మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ప్రత్యేకంగా అభినందించి,నగదు పురస్కారాన్ని (క్యాష్ రివార్డు) అందజేశారు.
దర్యాప్తును నడిపించిన ఎఎస్ఐ
ఎకరా 30 సెంట్ల భూవివాదం నేపథ్యంలో రూ. 6 లక్షల సుపారీ ఒప్పందంతో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ క్లిష్టమైన హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో ఎస్ఐ నరసింహారావు కీలక పాత్ర పోషించారు. తన దర్యాప్తు నైపుణ్యంతో క్షేత్రస్థాయిలో సాక్ష్యాలను సేకరించి,నిందితుల వ్యూహాన్ని బట్టబయలు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేయడంలో మరియు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకోవడంలో దర్యాప్తు బృందాన్ని సమర్థవంతంగా ముందుండి నడిపించారు.
డీఎస్పీ ప్రశంసలు
ఎఎస్ఐ నరసింహారావు చూపిన వృత్తి నైపుణ్యం,సమయస్ఫూర్తి మరియు కర్తవ్య దీక్షను డీఎస్పీ రాజేంద్రప్రసాద్, కొనియాడారు.ఈ సందర్భంగా ఎస్ఐ నరసింహారావు కి క్యాష్ రివార్డుతో పాటు అభినందన పత్రాన్ని అందజేశారు.శాంతిభద్రతల పరిరక్షణలో మరియు నేరాల అదుపులో ఇలాంటి ప్రతిభ కనబరిచే అధికారుల చొరవ పోలీస్ శాఖకే గర్వకారణమని డీఎస్పీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.