prajavaani.net
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 9:05 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

స్వామీజీ పేరుతో అక్రమ వసూళ్లు….భక్తులు అప్రమత్తంగా ఉండాలి: ఆలయ ఈవో భాగ్యలక్ష్మి

ఘట్‌కేసర్, ఆగస్టు 8 (ప్రజా వాణి): మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ సర్కిల్‌ పోచారం డివిజన్‌ యంనంపేటలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో శ్రీ శివ నాగేంద్ర సరస్వతీ మహాస్వామీజీ పేరుతో కొందరు వ్యక్తులు భక్తుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆలయ ఈవో భాగ్యలక్ష్మి తెలిపారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి నగదు ఇచ్చి భక్తులు మోసపోవద్దని ఆమె హెచ్చరించారు.

ప్రస్తుతం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో కాశీ పీఠం పీఠాధిపతి శ్రీ శివ నాగేంద్ర సరస్వతీ మహాస్వామీజీ చాతుర్మాస్య వ్రతం నిర్వహిస్తున్నారని ఈవో తెలిపారు. స్వామీజీ పేరును ఉపయోగించుకుని కొందరు వ్యక్తులు ఆలయానికి వచ్చే భక్తుల వద్ద నగదు సేకరిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.

స్వామీజీ దర్శనానికి వచ్చే భక్తులు తమ శక్త్యానుసారం పండ్లు, పుష్పాలు, పూజా సామగ్రి మాత్రమే తీసుకురావాలని సూచించారు. ఆలయంలో గానీ, ఆలయం వెలుపల గానీ స్వామీజీ పేరు చెప్పుకుని నగదు వసూలు చేసే వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.

ఎవరైనా స్వామీజీ పేరుతో నగదు వసూలు చేస్తే, ఆ మొత్తానికి స్వామీజీకి గానీ, ఆలయానికి గానీ ఎలాంటి సంబంధం ఉండదని ఈవో భాగ్యలక్ష్మి వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అప్రమత్తంగా ఉండాలని, డబ్బుల సేకరణ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడే అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దని ఆమె కోరారు.