స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ఆచరించాలి.

ప్రిన్సిపాల్ బి. శంకర్ నాయక్.

తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
హుజూర్నగర్ ఆగస్టు 15 (ప్రజావాణి)
తెలంగాణ మోడల్ స్కూల్, మఠంపల్లి లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ బి. శంకర్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ తదితర స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని అన్నారు. వారి చిత్రాలను ఉంచడం, పేర్లను స్మరించడం మాత్రమే కాకుండా వారు పాటించిన సత్యం, అహింస, సమానత్వం, ఐక్యత, దేశభక్తి వంటి విలువలను జీవితంలో ఆచరించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ఉంటుందని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలను గౌరవించడం, పాఠశాల ఆస్తులను కాపాడటం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని సూచించారు.
భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి రాజ్యాంగ విలువలను పాటించాలని, కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో వివక్ష, ద్వేషాలకు తావివ్వకుండా అన్ని మతాలు, సంస్కృతులు, భాషలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
అలాగే జంతువులు, ప్రకృతి, చెట్లు, నీటి వనరులను సంరక్షించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులకు సూచించారు. ఇతరుల విజయాన్ని అభినందించడం, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, కోపం కంటే సహనాన్ని, ద్వేషం కంటే మానవత్వాన్ని ఎంచుకోవాలని అన్నారు.
నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు. విద్య మనకు జ్ఞానాన్ని ఇవ్వడంతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని, క్రమశిక్షణను, మానవత్వాన్ని పెంపొందించాలి. విజయవంతమైన వ్యక్తులుగా మాత్రమే కాకుండా మంచి మనుషులుగా, బాధ్యతాయుతమైన భారతీయులుగా ఎదగాలి” అని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.
చివరగా స్వాతంత్ర్య సమరయోధులు మనకు స్వేచ్ఛను అందించారు. మన బాధ్యత తరువాతి తరానికి మెరుగైన భారతదేశాన్ని అందించడం అని విద్యార్థులకు సందేశమిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సైదులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నిర్మల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలతో ఉత్సాహభరితంగా ముగిసింది.