షాబాద్ మండల ప్రజావాణిలో తొమ్మిది దరఖాస్తుల స్వీకరణ
షాబాద్, ఆగస్టు 17, ప్రజావాణి: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల ప్రజల నుంచి తొమ్మిది దరఖాస్తులు స్వీకరించినట్లు మండల ప్రత్యేక అధికారి, మండల అభివృద్ధి అధికారి అపర్ణ తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు అందజేశారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఏడు దరఖాస్తులు, విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు దరఖాస్తులు ఉన్నాయని అధికారులు తెలిపారు.
ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, గరిష్ఠంగా 30 రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అపర్ణ సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారులకు రసీదులు కూడా అందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో షాబాద్ తహసీల్దార్ అన్వర్, షాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మారెడ్డి, మండల విద్యాధికారి, మండల పంచాయతీ అధికారి, మండల వ్యవసాయ అధికారి, ఇరిగేషన్, వైద్య, పశుసంవర్ధక, హౌసింగ్, బీసీ, ఎస్సీ సంక్షేమ శాఖల అధికారులు, ఏఈవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ తదితరులు పాల్గొన్నారు.