prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 11:06 am Digital Edition : MAHESH MEDCHAL

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి

*విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి*

*గ్రామాల్లో విద్యుత్ పనులు ఎవరి బాధ్యత? అమాయక యువకుల ప్రాణాలతో చెలగాటమా?*

*డ్యూటీలో లేని అధికారుల ఆదేశాలు.. ఎల్‌సీ లేకుండానే పనుల్లోకి యువకుడు.. షాక్‌తో అక్కడికక్కడే మృతి*

*ఘటనపై అధికారుల వివరణలో పొంతనని ఆరోపణలు.. బాధ్యులపై చర్యలకు డిమాండ్*

*యువకుల శవాలతో సెటిల్మెంట్లో చేస్తున్న విద్యుత్ అధికారులు*

*యువకుల ప్రాణాలకు విలువ లేదా ఉన్నత అధికారులు స్పందించరా?*

మేడ్చల్: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ అమాయక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ పనులను నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లోని యువకులతో చేయించడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్యూటీలో లేని ఓ ఆపరేటర్‌కు ఎల్‌సీ ఇవ్వాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. అనంతరం సంబంధిత సిబ్బంది విధుల్లో ఉండి బయటకు వెళ్లిన సమయంలో, కిందిస్థాయి సిబ్బంది ఎల్‌సీ తీసుకోకుండానే గుబ్బ కోల్డ్ స్టోరేజ్‌లో విద్యుత్ పనుల కోసం ఓ యువకుడిని తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో ఫ్యూజ్ మార్చే సమయంలో యువకుడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల్లో తీవ్ర విషాదం నెలకొంది.

అధికారుల సమాధానంపై అనుమానాలు

ఘటనపై వివరణ కోరగా అక్కడి ఏఈ.. తాను లీవ్‌లో ఉన్నానని, పక్క సెక్షన్‌కు ఇన్‌చార్జిగా ఉన్నానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి అధికారుల బాధ్యత, ఎల్‌సీ జారీ ప్రక్రియ, విద్యుత్ సరఫరా నిలిపివేత వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు.

‘ఉద్యోగాలు కాపాడుకునేందుకు ప్రాణాలను బలిచేస్తారా?’

విద్యుత్ శాఖలో భద్రతా నిబంధనలు పాటించకుండా పనులు చేయించడం వల్లే ఇలాంటి విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి అమాయక యువకుల ప్రాణాలు బలికావడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే సమగ్ర విచారణ జరిపి, బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై విద్యుత్ పనులను శిక్షణ పొందిన, అధికారికంగా అనుమతించబడిన సిబ్బందితోనే చేయించాలని, భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరుతున్నారు.